దక్షిణ కొరియా కార్ల కంపెనీ హ్యుండై ఇటీవల విడుదల చేసిన ఎస్యూవీ ‘వెన్యూ’కు కస్టమర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. రెండు నెలల క్రితం దీనిని మార్కెట్లోకి విడుదల చేయగా ఇప్పటి వరకు 50 వేల బుకింగ్స్ సాధించామని హ్యుండై ప్రకటించింది. అత్యాధునిక టెక్నాలజీ, తగినంత జాగా, సౌకర్యం, భద్రత, ఆకర్షణీయత కలిగిన ఎస్యూవీని కోరుకునే నవతరం కస్టమర్ల కోసం వెన్యూను తయారు చేశామని హ్యుండై మోటార్ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ వికాస్ చెప్పారు. ఎస్యూవీ మార్కెట్లో తమకు 21 శాతం వాటా ఉందని చెప్పారు. ఈ వాహనంలోని బ్లూలింక్ టెక్నాలజీ కస్టమర్లను ఎంతో ఆకర్షిస్తోందని అన్నారు. హ్యుండై ఇండియా మార్కెట్లోకి గత నెల 21న ‘వెన్యూ’ను విడుదల చేసింది. దీనిని పూర్తిగా ఇండియాలోనే తయారు చేశారు. ఒక లీటర్ టర్బో, 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్లతో అందుబాటులో ఉంటుంది. ఢిల్లీ ఎక్స్షోరూం ధరలు రూ.6.5 లక్షల నుంచి రూ.11.1 లక్షల వరకు ఉన్నాయి. ఈ కారును అభివృద్ధి చేయడానికి రూ.690 కోట్లు ఖర్చు చేశామని కంపెనీ తెలిపింది. వెన్యూలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, వైర్లెస్ ఫోన్ చార్జింగ్, ఏర్ ప్యూరిఫయర్, క్రూజ్ కంట్రోల్, 33 కనెక్టెడ్ ఫీచర్స్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి.