గత కొన్ని రోజులుగా తెలంగాణలో చిరుత పులులు జనావాసాల్లోకి వచ్చి హల్చల్ చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కూకట్పల్లిలోని ప్రగతినగర్లో చిరుత పులి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ప్రగతినగర్-గాజులరామారం ప్రాంతాల మధ్య ఉన్న కొండలపై చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
చిరుతపులి తిరుగుతున్న దృశ్యాలను కొందరు స్థానికులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. చిరుత ఎటునుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనన్న భయంతో ప్రగతినగర్ ప్రజలు భయం గుపిట్లో జీవిస్తున్నారు. దీంతో బుధవారం ఉదయం ఒక్కరు కూడా మార్నింగ్ వాక్కు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. స్థానికులు చిరుత సంచారంపై పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమచారం ఇచ్చారు. చిరుతను పట్టుకునేందుకు బోనులు ఏర్పాటుచేయాలని ప్రగతినగర్ ప్రజలు కోరుతున్నారు.