కృష్ణా బేసిన్‌లో పోటెత్తిన వరద

SMTV Desk 2019-07-30 14:41:41  

కర్ణాటక సాగునీటి అధికారులు వానారాయణపుర నుంచి ఔట్‌ఫ్లో సుమారు లక్ష క్యూసెక్కులకు పైగా పెంచడంతో.. జూరాలకు వరదనీరు పోటెత్తింది. ఇప్పటికే సరిహద్దులోని గూగల్ బరాజ్‌కు వరదనీరు చేరుకున్నాయి. తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో రాయిచూర్-హైదరాబాద్ జాతీయ రహదారి బ్రిడ్జి దిగువన కృష్ణా నది వరద తెలంగాణలోకి ప్రవేశించింది. క్రమంగా జూరాల ప్రాజెక్టుకు చేరుతున్నది. ఈ యేడాది వర్షాలు లేక తీవ్ర నిరాశలపాలైన రైతుల్లో ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణా బేసిన్‌లో నీటి పరవళ్లు ఆనందాన్ని నింపుతున్నాయి. లక్షల ఎకరాల్లో రైతాంగం కోటి ఆశల మధ్య ఎదురుచూస్తున్న జలాలు లక్ష క్యూసెక్కులను మోసుకొచ్చాయి. గత ఏడాది ఇదే నెల 18వ తేదీన కృష్ణా జలాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించగా.. ఇప్పుడు దాదాపు 11 – 12 రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి.

ప్రస్తుతం ఆల్మట్టి, నారాయణపుర జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఆల్మట్టిలో 129.72 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికిగాను 122.27 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. ఆల్మట్టి స్పిల్‌వే నుంచి, మరోవైపు కరంటు ఉత్పత్తి ద్వారా భారీగా నీటిని వదులుతుండటంతో నారాయణపురకు 1.32 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. నారాయణపుర నుంచి 1.23 లక్షల క్యూసెక్కులకు నీటిని నీటిని దిగువకు స్పిల్‌వే, కరంటు ఉత్పత్తి ద్వారా వదులుతున్నారు. ఇదే ఒరవడి కొనసాగితే మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలం జలాశయాన్ని కృష్ణా జలాలు తాకే అవకాశాలున్నాయి.

ఈ నేపథ్యంలో జూరాలపై ఉన్న అన్ని ఎత్తిపోతల పథకాలను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జూరాల జలాశయంలో 1.99 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వేగంగా నీటిమట్టం పెరిగే అవకాశమున్నందున జూరాల నుంచి నీటి విడుదల కూడా మొదలయ్యే అవకాశముంది. జూరాల కుడి, ఎడమ, సమాంతర కాల్వల ద్వారా నీటిని వదిలి చెరువులను నింపడంతో పాటు కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు పథకాల ద్వారా కూడా నీటి విడుదల ప్రారంభించనున్నారు. నారాయణపుర నుంచి నీటి విడుదలతో తెలంగాణ యంత్రాగం అప్రమత్తమైంది. కృష్ణా మండలంలోని ముడుమాల్, మురారిదొడ్డి గ్రామాల పరిధిలో పర్యటించారు. స్థానికులను అప్రమత్తం చేశారు. రైతులు, మత్స్యకారులు నదిలోకి వెళ్లవద్దని సూచించారు. ప్రస్తుతం నది నీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల పంపుసెట్లు మునిగిపోయే అవకాశం ఉన్నందున అన్నింటినీ తీయించినట్టు అధికారులు వెల్లడించారు.

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పస్పుల వద్ద సోమవారం సాయంత్రం కృష్ణ వరదను మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పరిశీలించారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి దిగువన ఉన్న మన రాష్ట్రంలోకి విడుదలైన కృష్ణానది వరదనీరు, మన సరిహద్దుల్లోకి ప్రవేశించిన వెంటనే భీమా ఎత్తిపోతల పథకం పంపింగ్‌ను ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తామని ఆయన తెలిపారు. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ హైడల్ ప్రాజక్ట్స్ సీఈ తెలిపారు. మహారాష్ర్టలో కురుస్తున్న వానలకు వరద నీరు ఎప్పుడు వచ్చినా విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కృష్ణా బేసిన్‌లోని ఆరు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అంతా సిద్ధం చేసినట్లు తెలిపారు. కృష్ణా జలాలు నిర్దేశిత స్థాయికి చేరగానే ఎగువ జూరాలలోని 6 యూనిట్లు, దిగువ జూరాలలోని 6 యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఒక్కచుక్క కూడా వృథా చేయకుండా విద్యుదుత్పత్తి నిర్వహించడమే లక్ష్యమన్నారు. ఎగువ నుంచి కొనసాగే ప్రవాహాన్ని బట్టి యూనిట్లను పెంచుతామని చెప్పారు. రెండ్రోజుల్లో ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లు వినియోగంలోకి వస్తాయన్నారు.

కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతున్నది. సోమవారం డ్యాంలోకి 14,683 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా, 1,799 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాంలో ప్రస్తుతం 24.444 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అటు మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ నది వరదనీటితో ప్రవహిస్తూ మూసీ రిజర్వాయర్‌లోకి చేరుతున్నది. సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డిగూడెం శివారులోని మూసీ వాగులో వర్షపు నీరు ప్రవహిస్తున్నది. మండలంలోని పలు గ్రామల్లోని చెరువులు, కుంటలు వరదనీటితో కళకళలాడుతున్నాయి. పొలాల్లోకి వచ్చిన కొద్దిపాటి వరదనీటితో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నల్లగొండ జిల్లా, కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు పరిసర ప్రాంతాల నుంచి 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 613 అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.