కన్న తండ్రే అత్యాచారం చేయించాడు..... కలకలం రేపుతున్న ఘటన!!

SMTV Desk 2019-07-23 10:50:46  

తన కన్నతండ్రే తనపై అత్యాచారం చేయించాడంటూ, గుంటూరులో నిన్న జరిగిన స్పందన కార్యక్రమంలో పట్టణ ఏఎస్పీ వైటీ నాయుడు ముందు ఓ బాలిక కన్నీటితో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. తమ బంధువేనని చెబుతూ తండ్రి ఓ యువకుడిని ఇంటికి తెచ్చాడని, అతను తనను కొట్టి, సిగరెట్లతో కాల్చి భయపెడుతూ, అత్యాచారం చేశాడని ఆ బాలిక ఆరోపించడంతో, కేసును సీరియస్ గా తీసుకుంటామని అధికారులు తెలిపారు. తాను ఇప్పటికే ఇద్దరిపై ఫిర్యాదు చేశానని, తన తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయి కావడంతో, కేసు నుంచి అతని పేరును పోలీసులు తొలగించారని ఆమె చెప్పగా, తాను విచారణ జరిపించి న్యాయం చేస్తానని నాయుడు అభయమిచ్చారు.

ఆమె ఫిర్యాదుపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించింది. తాను గుంటూరులో ఇంటర్మీడియట్‌ చదువుతున్నానని పేర్కొన్న ఆమె, తన తల్లిదండ్రుల మధ్య విభేదాలు రాగా, తల్లి గతంలోనే తండ్రిపై ఫిర్యాదు చేసిందని పేర్కొంది. ఈ కేసులో విచారణ జరుగుతోందని, తాను అప్పటి నుంచి తల్లి వద్దే ఉన్నానని తెలిపింది. ఒకరోజు తాను చదువుతున్న కాలేజీ వద్దకు కృష్ణ అనే యువకుడిని తీసుకొచ్చిన తండ్రి బంధువుగా పరిచయం చేశాడని, అతను తనను తరచూ కలిసి మాట్లాడేవాడని తెలిపింది.

ఈ క్రమంలో ఆరోజు తనతో మాట్లాడాలని ఓ లాడ్జికి తీసుకెళ్లిన కృష్ణ, తనను చిత్రహింసలు పెట్టి, అత్యాచారం చేసి, మొబైల్ ఫోన్ లో వీడియోలు తీశాడని, విషయం బయటకు చెబితే వాటిని ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడంది. తనను బెదిరించి, మరోమారు అత్యాచారం చేశాడని, ఆ సమయంలో తన తల్లి తనకు పదేపదే ఫోన్ చేస్తుంటే, బస్టాండ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లాడని, ఎందుకు ఆలస్యమైందని తల్లి నిలదీయగా, విషయం చెప్పానని బాధితురాలు పేర్కొంది. ఈ కేసును విచారిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.