ప్రపంచకప్ లో భాగంగా నేడు ట్రెంట్ బ్రిడ్జి నాటింగ్హామ్ వేదికగా భారత్-కివీస్ మ్యాచ్కు ఊహించినట్లుగానే వరుణుడు అడ్డంకి కల్పిస్తున్నాడు. వర్షం కారణంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్ కూడా సాగలేదు. నాటింగ్హామ్లో గురువారం వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ కొద్దిరోజులుగా చెబుతూనే ఉంది. అంచనాలకు తగినట్లుగా వరుణుడు మ్యాచ్కు అంతరాయం కలిగిస్తున్నాడు. అయితే మధ్యాహ్న సమయానికి వర్షం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో నిర్వాహకులు మ్యాచ్ ఎలాగైనా జరపాలని యోచిస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా మ్యాచ్ 50ఓవర్ల పాటు సాగే అవకాశాలైతే కనిపించడం లేదు. ప్రపంచకప్లో వరుణుడి కారణంగా ఇప్పటికే మూడు మ్యాచ్లు పూర్తిగా తుడుచుపెట్టుకుపోయాయి. దీంతో టోర్నీ కళ తప్పుతోందని అభిమానులు బాధపడుతున్నారు. ఇప్పుడు కివీస్-భారత్ మ్యాచ్లో జరుగుతుందో? లేదో? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ్ మ్యాచ్ రద్దయితే ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.