మాస్కో, ఆగస్టు 29 : జపాన్ ఉపరితలం మీదుగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియాపై ప్రపంచ దేశాలు మండి పడుతున్నాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేతో 40 నిమిషాల పాటు చరవాణి సంప్రదించారు. ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ట్రంప్ తో అత్యవసర భేటీ కానున్నట్లు చరవాణి సంప్రదింపుల అనంతరం షింజో అభే వెల్లడించారు. ఉత్తర కొరియాపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తర కొరియా విషయంలో జపాన్ కు వంద శాతం అమెరికా అండగా నిలబడుతుందని ట్రంప్ అభయం ఇచ్చినట్లు అభే ప్రకటించారు. వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా ప్రదర్శిస్తున్న దూకుడును ప్రతిఘటించేలా రష్యా, చైనా సహా ప్రపంచ దేశాలను సంఘటితం చేయనున్నట్లు వెల్లడించారు. ఇటు క్షిపణి ప్రయోగాలల్లో ఉత్తర కొరియా దూకుడుపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు రష్యా ప్రకటించింది. తాజా పరిస్థితులను గమనిస్తున్నామని త్వరలో ఓ నిర్ణయానికి రానున్నట్లు రష్యా విదేశాంగ సహాయ మంత్రి సెర్గె ర్యాబ్కో తెలిపారు.