రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతాదారులకు మరో శుభవార్త అందించింది. ఈ నేపథ్యంలో ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ (ఏటీఎం) చార్జీలు, ఫీజులకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆర్బీఐ జూన్ 6న ప్రకటించింది. దీంతో రానున్న రోజుల్లో ఏటీఎం చార్జీలు దిగిరావొచ్చు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సీఈవో ఈ కమిటీకి హెడ్గా వ్యవహరిస్తారు. ఏటీఎం పరిశ్రమ సమాఖ్య (సీఏటీఎంఐ) 2018 జూన్ నెలలోనే ఏటీఎం చార్జీల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆర్బీఐని కోరింది. ఇకపోతే కొత్తగా ఏర్పాటు కానున్న కమిటీ తన తొలి మీటింగ్ తర్వాత రెండు నెలలలోగా ప్రతిపాదనలను అందజేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. పాలసీ సమీక్ష తర్వాత ఆర్బీఐ ఈ నిర్ణయాలు వెల్లడించింది. ఇకపోతే ఆర్బీఐ నేడు జరిగిన పాలసీ సమీక్షలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లమేర కోత విధించిన విషయం తెలిసిందే. దీంతో రెపో రేటు 5.75 శాతానికి దిగొచ్చింది. దీంతో రానున్న రోజుల్లో బ్యాంక్ రుణ రేట్లు కూడా తగ్గనున్నాయి.