ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఏమాత్రం సత్తా చాటలేకపోయింది. రెండు చోట్ల పోటీ చేసిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు. రాజోలు నుంచి పోటీ చేసిన అభ్యర్థి రాపాక వరప్రసాద్ మాత్రమే గెలిచారు. ఆయన పార్టీ ఏకైక ఎమ్మల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలు కాకముందే ఆయనపై ఊహగానాలు వెల్లువెత్తుతున్నయి. రాపాక కూడా త్వరలో అధికార వైసీపీలో చేరిపోతారని, ఎస్సీ కోటా కింద జగన్ ఆయనకు మంత్రి పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఆయన చేరితే వైసీపీ బలం 152కు చేరుతుందని కథనాలు వస్తున్నాయి.
దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. తనకు పార్టీ మారే యోచన లేనే లేదని, జనసేన పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రజల కోసం పోరాడుతుందని అన్నారు. ‘నేను జనసేనలో ఉంటే నంబర్ 1ను. అదే వైసీపీలో చేరితే 152వ నంబరును. మా పార్టీ ప్రయాణం ఈ రోజు ఒక్కరితో మొదలైనా రేపు వందల మందితో ముందుకెళ్తుంది. నాకు బీజేపీ నుంచి ఆ హ్వానం అందింది. కానీ చేరనని చెప్పాను..’ అని రాపాక స్పష్టం చేశారు.