న్యూఢిల్లీ ఆగస్టు, 29 : చైనాలోని జియామెన్ సిటీలో జరిగే బ్రిక్స్ సమావేశంకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. చైనా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఆ దేశంలో జరగనున్న 9వ బ్రిక్స్ భేటీకి మోదీ హాజరవుతారని పేర్కొన్నారు. చైనా పర్యటన ముగిసిన అనంతరం అక్కడ నుంచి మయన్మార్ పర్యటనకు మోదీ బయల్దేరుతారు. మయన్మార్ లో 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పర్యటిస్తారు. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఆ దేశ పర్యటనకు మోదీ వెళ్లక పోవచ్చని తొలుత కొందరు అనుకున్నారు. కాగా, వివాదాలన్నింటినీ పక్కన పెట్టి ప్రధాని మోదీ, చైనా వెళ్లేందుకు అంగీకరించారు.