రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలలో ప్రవేశాల కొరకు డిగ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ (దోస్త్) గడువును మరొకరోజు పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఎలాంటి అపరాదరుసుము లేకుండా గురువారం వరకు విద్యార్దులు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఇప్పటివరకు 1,18, 329 మంది విద్యార్దులు తమ పేర్లను నమోదు చేసుకొన్నారని లింబాద్రి తెలిపారు.
దోస్త్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే విద్యార్దులు కావాలనుకొంటే ఆన్లైన్లోనే ఫీజు కూడా చెల్లించవచ్చు. ఇంజనీరింగ్ కాలేజీలలో ఏవిధంగా ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు జరుగుతాయో అదేవిధంగా దోస్త్ ద్వారా వివిద కాలేజీలలో సీట్లు పొందిన విద్యార్దులు ఆన్లైన్లోనే ఆయా కాలేజీలలో చేరుతున్నట్లు తెలియజేయవచ్చు. టీ-వ్యాలెట్ ద్వారా కూడా కాలేజీ ఫీజులు చెల్లించే వెసులుబాటు కల్పించినందున విద్యార్దులపై సర్వీస్ ఛార్జీల భారం ఉండదు. అంతేకాదు ఒకవేళ విద్యార్దులు వేరే కాలేజీకి మారదలిచినా వారిపై యాజమాన్యం ఒత్తిడి ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా పాత 10 జిల్లా కేంద్రాలలో దోస్త్ ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. కనుక డిగ్రీలో చేరే విద్యార్దులకు ఏవైనా అనుమానాలు కలిగినా, సమస్యలు ఎదురైన అక్కడికి వెళ్ళి పరిష్కరించుకోవచ్చు.