కోర్టుల్లో బెయిళ్లకు దారులు మూసుకుపోయాయి. అరెస్ట్కు రంగం సిద్ధమవుతోంది. విజయవాడ, బెంగళూరు, ముంబైలలో సోదాలు సాగుతున్నాయి. దేశం నుంచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఇక చేసేదేమీ లేక రవిప్రకాశ్ ఈ రోజు సైబరాబాద్ పోలీసుల ముందు హాజరయ్యారు. టీవీ9 కేసుల్లో ఈ మాజీ సీఈవో హైదరాబాద్కు చేరుకుని సైబరాబాద్ పోలీసులకు వాంగ్మూలం ఇస్తున్నారు.
బెయిల్ పిటిషన్ను తాము విచారించలేమని, హైకోర్టుకు వెళ్లాలని, విచారణ కోసం పోలీసుల ఎదుట హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో మరోదారి లేక ఆయన పొలీసుల ఎదుట హాజరయ్యారు. ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకల్లో ఆయన తలదాచుకుంటున్నారని, 30 సిమ్ కార్డులు మార్చారని వార్తలు వచ్చాయి. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్మార్క్లు మీడియా నెక్ట్స్ ఇండియా కంపెనీకి వాటాల బదలాయింపుపై కేసులు నమోదు కావడం తెలిసిందే. కాగా రవిప్రకాశ్తో పాటు పరారీలో ఉన్న సహ నిందితుడు, నటుడు శివాజీ కూడా పోలీసుల ముందు హాజరవుతారని భావిస్తున్నారు.