అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తరువాత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నేడు తొలిసారిగా విశాఖపట్నంలో పర్యటించనున్న నేపధ్యంలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. అయితే తొలి పర్యటన అయినా ఇది పూర్తి ఆధ్యాత్మిక పర్యటనగా సాగనుంది. కొద్ది సేపటి క్రితమే జగన్ శారదాపీఠంకు చేరుకున్నారు. జగన్ కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజశ్యామల అమ్మవారికి వైఎస్ జగన్ పూజలు చేయనున్నారు. అనంతరం ఆయన స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకోనున్నారు. జగన్ తో, అక్కడి రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించాలని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూజల తరువాత స్వరూపానందేంద్రతో జగన్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. మంత్రివర్గం కూర్పు, విస్తరణకు మంచి ముహూర్తంపై ఆయనతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే ముందు స్వరూపానందేంద్ర ఆశీర్వాదాన్ని జగన్ తీసుకున్నారు. ఆ తరువాత అఖండ విజయాన్ని జగన్ సొంతం చేసుకున్నారు. ఈ కారణంతోనే జగన్ కి స్వామీ వారి మీద గురి కుదరడంతో మరోసారి స్వామి ఆశీస్సుల కోసం జగన్ ఈరోజు వచ్చారు. జగన్ పర్యటన నేపధ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.