జగన్ మార్క్ మాములుగా లేదుగా ...

SMTV Desk 2019-06-04 16:14:20  Jagan Mania,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఏపీ పాలనను తన దారిలోకి తెచ్చుకుని తనదైన మార్క్ వేయాలని చూస్తున్నారు. జూన్ 8వ తేదీన మంత్రివర్గాన్ని ఏర్పర్చుకొని పాలన సాగించాలని చూస్తున్న జగన్ అటు వివిధ శాఖల పై అధ్యయనం తో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టుల పైన కూడా దృష్టి సారించారు. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతి ముఖ్యమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా ఎవరిని నియమించాలనే దానిపై దృష్టిసారించిన జగన్ టిటిడి ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేలా నిర్ణయం తీసుకోనున్నారు. అయితే టీటీడీ ఛైర్మన్ రేసులో మోహన్ బాబు, కోన రఘుపతి తదితరులు ఉండగా జగన్ తన బాబాయి వై వి సుబ్బారెడ్డి పేరును ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

అయితే మామూలుగా చుట్టుపక్క రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో బోర్డు మెంబర్ పదవి ఇవ్వడం ఆనవాయితీ, ఈ నేపధ్యంలో 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించి, ఆపై టీఆర్ఎస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏపీ సీఎం వైఎస్ జగన్ బంపరాఫర్ ఇస్తున్నారని అంటున్నారు. పార్టీ మారినప్పటికీ, జగన్ పై అభిమానాన్ని చూపిస్తూ వచ్చిన పొంగులేటికి టీటీడీ బోర్డ్ సభ్యుడి పదవిని జగన్ ఇస్తానని ప్రామిస్ చేసినట్టు తెలుస్తోంది. టీటీడీ బోర్డు సభ్యుల్లో ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యాన్ని కల్పించే ఆనవాయితీలో భాగంగా తెలంగాణ నుంచి పొంగులేటిని నామినేట్ చేసేందుకు జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.