పగలంతా 40 డిగ్రీలకు మించి చావ గొడుతున్న ఎండ. అదే రోజు సాయంత్రానికి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.గత రెండు రోజుల్లో తెలుగురాష్ట్రాలు చూసిన వాతావరణ పరిస్థితి ఇది. ముఖ్యంగా నిన్న పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. పెనుగాలులతో భారీ వర్షం పడటంతో హైదరాబాద్, శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు, అనంతపురం, నిజామాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో ప్రజల జన జేవనం స్తంబించి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ఈ వేసవికి వరుణుడు ముగింపు పలికినట్టేనని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ వర్షాలకు నైరుతి రుతుపవనాలు కారణం కాదని, ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో ఆవర్తనాలు ఏర్పడటమే కారణమని అధికారులు వెల్లడించారు. దీని కారణంగానే తెలంగాణలో 438 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని, గంటల వ్యవధిలోనే తీవ్ర వేడి, ఉక్కపోతలతో పాటు చల్లదనాన్ని కూడా ప్రజలు అనుభవించారని వారు తేల్చారు. ఇక నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, 6వ తేదీ నాటికి కేరళను తాకవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది.