లోక్సభ ఎన్నికల్లో ఓటమితో కష్టాల్లో కూరుకుపోయిన సమాజ్వాదీ పార్టీని సుదురాయించే బాధ్యత ములాయం సింగ్ యాదవ్ ఎత్తుకున్నారు. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ పెద్దాయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఎస్పీని తిరిగి బలోపేతం చేసేలా, దూరమైపోయిన తమ్ముళ్లను, ఇతర నేతలను సొంతగూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజల్ట్స్ తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న అఖిలేశ్, టీవీ డిబేట్లకు వెళ్లొద్దని పార్టీ నేతల్ని ఆదేశించారు. కొద్దిరోజుల కిందటే ఓటమిపై విశ్లేషణ మొదలుపెట్టిన ఆయన, గతానికి భిన్నంగా ఇప్పుడు ప్రతి చిన్నవిషయానికి నేతాజీ సలహాను తీసుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అఖిలేశ్ అంతా తానై వ్యవహరించిన 2019 లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ కేవలం 5 సీట్లలో మాత్రమే గెలవగలిగింది. పార్టీ కంచుకోట మైన్పురిలో ములాయం 95వేల ఓట్ల మెజార్టీతో గెలవగా, మిగతా చోట్ల ఎస్పీ అభ్యర్థులు సాధారణ మెజార్టీతో గట్టెక్కారు. పార్టీకి మునుపటి క్రేజ్ రావాలంటే యాదవనేతల్ని దగ్గరకుతీసుకోవాలని ములాయం సూచించారని, ఆ మేరకు బాబాయి శివపాల్ యాదవ్తో రాజీకి అఖిలేశ్ అంగీకరించారని, అతిత్వరలోనే శివపాల్ తిరిగి ఎస్పీలో చేరతారని సమాజ్వాదీ ముఖ్యనేతలు వెల్లడించారు. శివపాల్ యాదవ్ ఎన్నికల ముందు ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ లోహియా(పీఎస్పీఎల్) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే.