కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. తర్వాత మాట్లాడారు. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పారని.. కానీ మజ్లిస్ పార్టీ ఒత్తిడితో అధికారికంగా నిర్వహించడం లేదని చెప్పారు. తెలంగాణ సమాజం మరో పోరాటానికి సమాయత్తం కావాలని, టీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆ పోరాటానికి నేతృత్వం వహించడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.