పాట్నా, ఆగస్టు 28 : గత కొన్ని రోజులుగా బీహార్, ఉత్తరప్రదేశ్ లో వరద భీభత్సం కొనసాగుతుంది. దీంతో బీహార్ లో గడిచిన 24 గంటల్లో 42 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 482కు చేరింది. 19 జిల్లాల పరిధిలోని 1 . 72 కోట్ల మంది ఇంకా వరద ముంపులోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జాతీయ విపత్తు నివారణ సంస్థకు చెందిన 28 బృందాలు 630 మంది సైనికులు వివిధ బృందాలుగా విడిపోయి సహాయ పునఃరవాస చర్యలు చేపడుతున్నారు. బీహార్ లోని పలు ప్రాంతాలో నేడు కూడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అటు ఉత్తరప్రదేశ్ లోని అనేక ప్రాంతాలు వర్షపు నీటిలో ఉన్నాయి, వరద ప్రభావం క్రమంగా తగ్గుతుంది. యూపీలో గత 24 గంటల్లో ఐదుగురు చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 101 కి చేరిపోయింది. యూపీలో 2000 గ్రామాలకి వరద ప్రభావం తగ్గగా, మరో 3000 పైగా గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. అసోం, బంగాల్ కూడా కొద్ది రోజులుగా వరదలు ముంచెత్తగా ప్రస్తుతం పరిస్థితి కుదుట పడుతుందని అధికారులు తెలిపారు.