ఆటా నాదే వేటా నాదే అంటున్నారు నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగమ్మోహన్రెడ్డి. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించి ఏపీ చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ నెల 30న నవ్యాంధ్ర కొత్త ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేసిన వైఎస్ జగన్ ఆట నాదే వేట నాదే అంటూ అప్పుడే వేట మొదలుపెట్టారు. తొలి ప్రసంగంలోనే ఏపీలో వున్న ప్రత్యర్థులకు రానున్న రోజుల్లో ఎలాంటి గుణపాఠం చెప్పబోతున్నారో బాహాటంగానే వెల్లడించిన ఆయన దూకుడు పెంచారు.
అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్ను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించడానికి వచ్చిన టీడీపీ నాయకులకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేకపోయిన పలువురు టీడీపీ నేతలు స్వయంగా జగన్ను కలిసి అభినందించాలనుకున్నారు కానీ అందుకు జగన్ ఒప్పుకోకపోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. బుధవారం రాత్రి జగన్ టీమ్కు సమాచారం అందించి గురువారం కలవడానికి వచ్చి టీడీపీ త్రిసభ్య కమిటీకి చేదు అనుభవం ఎదురుకావడం చర్చకు దారితీస్తోంది. దీన్ని బట్టి జగన్ ఎలాంటి ఆట ఆడబోతున్నాడో క్లియర్గా అర్థమవుతోందని, ఇక టీడీపీ ఏపీలో గల్లంతేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే జగన్ ఓటమి తర్వాత పార్టీ తరపున గెలిచి.. అడ్డగోలుగా నట్టేట ముంచి తేదేపాలో చేరిపోయిన వారికి ఎలాంటి చుక్కలు చూపించబోతున్నారో అంటూ ఒకటే ఆసక్తికర చర్చ ఏపీ పొలిటికల్ కారిడార్ లో సాగుతోంది.