వైట్‌హౌస్‌ వద్ద ప్రవాస భారతీయుడి ఆత్మహత్య

SMTV Desk 2019-05-31 15:40:51  Man lights himself on fire near the White House

అమెరికాలోని వైట్‌హౌస్‌ వద్ద ఓ ప్రవాస భారతీయుడు పెట్రోల్ తో నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.25 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్ణవ్ గుప్తా(33) అనే యువకుడు అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో గుప్తా శరీరం పూర్తిగా కాలిపోయింది. పోలీసులు మంటలు ఆర్పి వైద్యం కోసం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ‌మృతి చెందాడు. దీనిపై అమెరికా పార్క్ పోలీసులు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గుప్తా మేరీల్యాండ్‌లో నివసిస్తున్నట్టు తెలిపారు. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన అతడు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇంటి నుంచి బయటకు వచ్చిన గుప్తా వైట్‌హౌస్ సమీపంలోని ఎలిప్స్‌ పార్క్‌కు వచ్చి, అందరూ చూస్తుండగానే తనకు తానూ నిప్పంటిచుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలేంటో తెలియడం లేదు. దీనిపై ఎలిప్స్ పార్క్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.