హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ ప్రజలకు పండుగ దినమైన రాష్ట్రఅవతరణ దినోత్సవావ్ని చీకటిదినంగా చంద్రబాబు పేర్కొనడం తెలంగాణాపై ఉన్న అక్కసు, నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు.సిద్ధిపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో ఆయన ప్రసంగించారు.చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే తెలుగుదేశం నాయకులు క్షమాపణ చెప్పకపోతే నిరసనలు చేపడుతామని తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలకు తెలంగాణ తెలుగుదేశం నాయకలు సిగ్గుతో తలదించుకోవాలని, ఇకనైనా చంద్రబాబు భజన మానుకోవాలని సూచించారు. ఆయన భజన చేసే వారిని, ఆయన నాయకత్వంలో పనిచేసే వారిని తెలంగాణ ద్రోహులుగానే పరిగణిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను పాలించడంలో విఫలమై అభివృద్ధిలో తెలంగాణాతో ఆయన పోటీపడలేక పోతున్నారని, మీ కంటే కేసీఆర్ పాలనే బాగుందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నించడంతో విభజన పేరుతో తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబుదీక్షలు చేస్తు సోదర రాష్ట్రంపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. విభజన సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా నీటి పంపకాలు జరుపకుండా అన్యాయం చేసినప్పటికీ ముఖ్యమంత్రి కేసిఆర్ సొంత ఆలోచనలతో సమస్యలను సమర్థంగా ఎదుర్కొని ఉత్తమ పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. టీడిపితో పొత్తు పెట్టుంటామన్న కాంగ్రెస్, బిజెపి నాయకులు చంద్రబాబు వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను టి టిడిపి, బిజెపి నాయకులు ఖండిస్తారో, సమర్థిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.