పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన నిరవ్ మోడీకి బ్రిటన్లోని కోర్టు జూన్ 27 వరకూ రిమాండ్ పొడిగించింది. ఆయన కొద్ది నెలల క్రితం అరెస్టై ప్రస్తుతం వాండ్స్వర్త్ జైలులో ఉంటున్నాడు. PNB రూ.వేల కోట్లు ఎగవేసిన నిరవ్ లండన్ పారిపోవడంతో ఈయన్ను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యల్లో భాగంగా లండన్లోని వెస్ట్మినిస్టర్ కోర్టులో దీనికి సంబంధించి కేసు విచారణ దశలో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కుంభకోణంలో నిరవ్ ‘ప్రధాన ప్రయోజనకారి’ అని దశల వారీ విచారణ తర్వాత వెస్ట్ మినిస్టర్ కోర్టు తెలిపింది. మరోవైపు అప్పగిస్తే అతణ్ని ఎలాంటి జైలులో ఉంచుతారో తమకు 14 రోజుల్లో తెలపాలని న్యాయమూర్తి అర్భుత్నాట్ భారత్కు సూచించారు. గతంలో మాల్యా కేసులోనూ న్యాయమూర్తి జైలు వివరాలు కోరారు. మార్చి 19న లండన్లో అరెస్టైన నిరవ్ మోడీ.. ఇప్పటికి వరకు పెట్టుకున్న నాలుగు బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.