పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేతకు సంబంధించి ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మల్లేశం’. ఈ సినిమాలో ప్రియదర్శి, అనన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని బుధవారం విడుదల చేశారు.
పూర్తిస్థాయిలో తెలంగాణ మాండలికంలో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ట్రైలర్ను చూసిన తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ కీలకనేత కేటీఆర్.. తన ట్విట్టర్ ద్వారా చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
"మల్లేశం మూవీ ట్రైలర్ చూశాను. తెలంగాణలోని స్ఫూర్తిదాయకమైన గ్రామీణ వినూత్నకారుడైన చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఇది. ఆసు యంత్రం కనుగొన్న ఆయనను 2017లో పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీసుకువస్తున్న చిత్ర యూనిట్కు అభినందనలు" అని కేటీఆర్ తన ట్వీట్లో తెలిపారు.