కేటీఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం

SMTV Desk 2019-05-31 11:53:18  ktr,

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో నిర్వహించే ఈ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాల్సిందిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. అక్టోబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. గత మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సమావేశాలకు సంబంధించిన విషయాల పైన ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపింది. మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్ అనే థీమ్ తో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన ఆహ్వానంలో చెప్పింది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశం ఒకటని, ప్రపంచ మాంద్యంలో కూడా భారతదేశం సరైన అభివృద్ధిని నమోదు చేసిందని ఈ సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఇన్నోవేషన్ , టెక్నాలజీ రంగాల్లో వినూత్న కార్యక్రమాలను చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించారని… ఈ సదస్సుకు హాజరై తన అనుభవాలను పంచుకోవాలి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోరింది.