లండన్: నైన్ డాట్స్ ప్రైజ్ 2019 పోటీల్లో భారతీయ రచయిత్రి, జర్నలిస్టు అన్నీ జైదీ విజేతగా నిలిచారు. దైనందిన సామాజిక అంశాలపై రచనలు, సృజనాత్మక ఆలోచలనను ప్రోత్సహించేందుకు ఈ గ్లోబల్ బుక్ ప్రైజ్ను ఏర్పాటు చేశారు. 2019 నైన్ డాట్స్ ప్రైజ్కు జైదీని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు బుధవారం తెలిపారు. దీని పరిధిలో విజేతకు రూ 69.83 లక్షలు అందుతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త కోణాలలో రగులుతున్న వర్తమాన క్లిష్ట సమస్యలు వాటి విశ్లేషణలను చిత్రీకరించే రచనలకు నైన్ డాట్స్ ద్వారా పట్టం కడుతున్నారు. ముంబైకి చెందిన 40 ఏళ్ల అన్నీజైదీ ఫ్రీలాన్స్ రైటర్గా ఉన్నారు. వ్యాసాలు, చిన్న కథలు, కవితలు, నాటికలు వంటి బహుముఖ ప్రక్రియలలో ఆరితేరారు. ఆమె రచన బ్రెడ్, సిమెంట్ , కాక్టస్ (ముళ్ల చెట్టు) అనే వ్యాసానికి ఇప్పుడు ఈ భారీ బుక్ ప్రైజ్లో మిన్నగా నిలిచింది. భారతీయ సమాజంలో ఇప్పుడు ఇళ్లలో నెలకొంటున్న పరిస్థితులు, ఆలోచనలు, వివిధ సమస్యలపై తన అనుభవాలను ఇందులో ఆమె హృద్యంగా మలిచారు. ప్రతి ఏటా నైన్ డాట్స్ ప్రైజ్ పోటీకి ప్రకటన వెలువడుతుంది. ఇందులో చుట్టూ ఉండే సమకాలీన అంశాలపై 3వేల పదాలకు మించకుండా వ్యాసాలను ఆహ్వానిస్తారు. ప్రతి ఏటా ఒక అంశాన్ని ఇచ్చి వ్యాసాలకు ఆహ్వానిస్తారు.