ఆ డ‌బ్బుతో నేనేం చేసుకుంటాను!!

SMTV Desk 2019-05-30 19:10:29  sai pallavi

ప్రేమ‌మ్‌ సినిమాతో మ‌ల‌యాళ తెర‌పై మెరిసిన సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా మారింది. త‌న‌ అద్భుత‌మైన డ్యాన్స్‌తోపాటు ప్ర‌తిభావంత‌మైన న‌ట‌న‌తో అభిమానుల‌ను ఫిదా చేస్తోంది. న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న చిత్రాల‌నే అంగీక‌రిస్తూ గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటోంది. అలాగే క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌ను కూడా తిర‌స్క‌రిస్తోంది. రెండు కోట్ల రూపాయ‌ల పారితోషికం ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చినా ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లో న‌టించేందుకు సాయిప‌ల్ల‌వి అంగీక‌రించ‌లేదట‌.

త‌మిళ టాప్ హీరో సూర్య స‌ర‌స‌న ఆమె న‌టించిన ఎన్‌జీకే సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఆ యాడ్ గురించి సాయి ప‌ల్ల‌వి స్పందించింది. `ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రూ ఒకే రంగుతో ఉండ‌రు. ఇది భార‌తీయుల రంగు. ఆమెరికా, యూర‌ప్ ప్ర‌జ‌లు తెల్ల‌గా ఉంటారు. ఆఫ్రిక‌న్స్‌కి కూడా వారి రంగు వారికుంది.

రంగుతో సంబంధం లేకుండా అంద‌రూ అందంగానే ఉంటారనేది నా భావ‌న‌. అందుకే ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌ను తిర‌స్క‌రించాను. ఆ యాడ్ చేయ‌డం వ‌ల్ల వ‌చ్చిన‌ డ‌బ్బుతో నేనేం చేసుకుంటాను. ఇంటికెళ్లి మూడు చ‌పాతీలు తిని, కారులో షికారు చేస్తాను. నాకు పెద్ద పెద్ద అవ‌స‌రాలు లేవు. డ‌బ్బు సంపాద‌న కంటే నా చుట్టూ ఉన్న‌వారిని ఆనందంగా ఉంచ‌డానికే నేను ఇష్ట‌ప‌డ‌తాన‌`ని సాయిప‌ల్ల‌వి చెప్పింది.