ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఓ శుభవార్త

SMTV Desk 2019-05-30 18:33:55  graduate engineers, cognizant company

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఓ సువర్ణావకాశం. అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ఎంట్రీ లెవల్‌ (ప్రారంభ స్థాయి) ఉద్యోగుల వేతనాలను పెంచుతోంది. దీంతో వారికీ ప్రారంభ జీతమే రూ.4 లక్షలకుపైగా ఉండనుంది. వచ్చే ఏడాది కంపెనీలో కొత్తగా చేరే వారికి కొత్త వేతన ప్యాకేజ్ అందుబాటులో ఉండొచ్చు. కంపెనీ ప్రస్తుతం కన్నా 18 శాతం ఎక్కువ వేతనాన్ని అందించనుంది. 2020 జూన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసే ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కాగ్నిజెంట్‌ ఇచ్చే వార్షిక వేతన ఆఫర్‌ రూ.3.38 లక్షల నుంచి రూ.4 లక్షలకు పైగా పెరగనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐటీ కంపెనీలు ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబరులో ఉద్యోగుల నియామకాల కోసం క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లను చేపట్టనున్నాయి. ఈ సందర్భంగా వచ్చే ఏడాది కంపెనీలోకి తీసుకునే వారికి ఆఫర్‌ లెటర్లను ఇస్తాయి. మరోవైపు కాగ్నిజెంట్‌కు ప్రస్తుతం భారత్‌లో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ వార్షికంగా సగటున దాదాపు 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటోంది. కాగా ప్రస్తుతం ఎంట్రీలెవల్‌లో చేరే ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఇచ్చే వార్షిక వేతనం రూ.3.30-3.60 లక్షలు ఉంది.