న్యూఢిల్లీ, ఆగస్టు 28 : నేడు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా ప్రమాణస్వీకారం చేశారు. 64 ఏళ్ల జస్టిస్ దీపక్ మిశ్రాను ప్రధాన న్యాయమూర్తిగా భారత దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ, తదితరులు హాజరయ్యారు. జస్టిస్ జేఎస్ కెహార్ ఈ నెల 27న పదవి విరమణ చేయడంతో, వారి స్థానంలో జస్టిస్ దీపక్ మిశ్రా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 3, 1953 ఓడిస్సాలో జన్మించిన మిశ్రా, 1977 న్యాయవాదిగా ఆ రాష్ట్ర హైకోర్టు లో శిక్షణ మొదలు పెట్టారు. పాట్నా, ఢిల్లీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2011 లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మిశ్రా వచ్చే సంవత్సరం అక్టోబర్ 2 తేదీ వరకు కొనసాగనున్నారు.