ఆస్ట్రేలియా జట్టు కీలక ఆటగాళ్ళు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్లు బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని ఏడాది నిషేధం అనంతరం తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ ఇద్దరి రాకతో ఆసీస్ బలం పెరిగింది. శ్రీలంకతో జరిగిన రెండో వార్మప్ మ్యాచులో వార్నర్, స్మిత్లు రెస్ట్ తీసుకున్నారు. ఖవాజా (89) పరుగులు చేయడంతో ఆసీస్ సునాయాస విజయాన్ని అందుకుంది. స్టార్ బౌలర్లు కూడా స్టార్క్, కమ్మిన్స్, రిచర్డ్ సన్, జంపాలు రాణించారు. రెండు వార్మప్ మ్యాచులలో గెలిచిన ఏకైక జట్టు ఆసీస్ మాత్రమే. దీంతో ప్రపంచకప్కు ముందు ఆసీస్ బాగానే సన్నద్ధమైంది. తాజాగా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ... పది నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు చాలా పటిష్ఠంగా ఉంది. ఆటగాళ్లు నిలకడగా రాణిస్తూ.. వారి పాత్రలను పోషిస్తున్నారు. అందరూ ఫామ్ లో ఉండడం మాకు కలిసొచ్చే అంశం. మే 1 నుంచి ఒక జట్టుగా కలిసికట్టుగా ఆడుతున్నాం. మేము ఇంకా కొన్ని అంశాల్లో పటిష్ఠం అవుతున్నాం. ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శన ఇస్తాం అని ఫించ్ తెలిపాడు.