బెంగాల్ లో దీదీకి మ‌రో షాక్.. మోదీ చెప్పిన‌ట్టే..

SMTV Desk 2019-05-29 11:50:00  bjp, modi, mamatha, tmc,

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో వారు కాషాయ కండువాను కప్పుకున్నారు. వారిలో బిజ్‌పుర్ నుంచి ఎన్నికైన సుబ్రన్ష్ రాయ్, నోవాపరా నుంచి సునీల్ సింగ్, బర్రాకోప్రే నుంచి గెలిచిన సిల్‌భద్ర దత్తా ఉన్నారు. వీరితో పాటు రాష్ట్రంలోని 24 జిల్లాలకు చెందిన 50మంది కౌన్సిలర్లు బీజేపీ తీర్ధాన్ని పుచ్చుకున్నారు.

ఇదిలావుండ‌గా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మోదీ.. టీఎంసీకి చెందిన 40మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై స్పందించిన మమతా.. దమ్ముంటే ఒక్కరిని తీసుకోండి అంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరేందుకు వెళ్లడంతో మోదీ చెప్పినట్టే జరుగుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించగా.. పశ్చిమబెంగాల్‌లో 18సీట్లను సాధించింది. మరోవైపు టీఎంసీ 22సీట్లను దక్కించుకుంది.