అడవి శేష్, శివానీ సినిమా కి అనుకోని ఆటంకం

SMTV Desk 2019-05-28 11:01:57  Advi sesh, Shivani,

జీవితా రాజశేఖర్ దంపతుల పెద్ద కుమార్తె శివానీ కథానాయికగా పరిచయం అవుతున్న ‘టూస్టేట్స్’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని, తనకు తెలియకుండా నిర్మాత ఎం.ఎల్.వి సత్య నారాయణ (సత్తిబాబు) కథలో మార్పులు చేశారని ఆరోపిస్తూ దర్శకుడు వెంకట్ రెడ్డి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. సినిమా నుంచి తనను అర్థాంతరంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని.. తనను కాదని ఎవరు దర్శకత్వం వహించడానికి వచ్చినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.

విచారణ చేపట్టిన కోర్టు నిర్మాత సత్యనారాయణ ఈ నెల 30న హాజరై, వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘2 స్టేట్స్’. దీనికి తెలుగు రీమేక్‌గా అదే టైటిల్‌తో ‘టూ స్టేట్స్‌’ను రూపొందిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. దర్శక, నిర్మాతల మధ్య భేదాభిప్రాయాలతో సినిమా చిత్రీకరణ మధ్యలో నిలిచిపోయింది. అడవి శేష్, శివానీ జంటగా నటిస్తున్నారు. ఈమధ్య మంచు విష్ణు సినిమా ‘ఓటర్’ కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్న విషయం తెలిసిందే.