సర్వేల స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్ కు షాక్

SMTV Desk 2019-05-27 18:25:05  Lagadapati,

ఎపి ఎన్నికల ఫలితాలపై తప్పుడు సర్వేలు చేసి, కోట్లాది రూపాయల బెట్టింగ్ కు కారణమైన మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ పై చర్యలు తీసుకోవాలని కొవ్వూరుకు చెందిన సీనియర్ న్యాయవాది పిల్లలమర్రి మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 19న ముగిసింది. పోలింగ్ ప్రక్రియ ముగియగానే లగడపాటి తన సర్వే ఫలితాలను వెల్లడించారు. ఎపిలో టిడిపి అధికారంలోకి రానుందని, 90 నుంచి 100 సీట్లను టిడిపి గెలుచుకోబోతుదని తన సర్వేలో తేలిందని రాజగోపాల్ మీడియా సమావేశంలో తెలిపారు. అయితే ఈనెల 23న జరిగిన ఓట్ల లెక్కింపులో ఊహించని రీతిలో వైసిపి అఖండ విజయం సాధించింది. దీంతో రాజగోపాల్ తప్పుడు సర్వే చేసి ప్రజలను గందరగోళానికి గురి చేశారని విమర్శలు వచ్చిన విషయం తెలిసింది. దీంతో ఖంగుతిన్న రాజగోపాల్ ఇకపై తాను సర్వేలు చేయనని చెప్పారు. అయినప్పటికీ వైసిపి కార్యకర్తలు రాజగోపాల్ పై మండిపడుతున్నారు. రాజగోపాల్ సర్వేలను నమ్మి ఎంతో మంది కోట్లాది రూపాయలు బెట్టింగ్ కాసి నష్టపోయారని మురళీ కృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజగోపాల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.