హైదరాబాద్, ఆగస్ట్ 26 : ప్రభాస్ నటిస్తున్న "సాహో" చిత్రానికి సంబంధించి మరో కొత్త విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు "అరుణ్ విజయ్" ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. "ప్రభాస్ తో స్క్రీన్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను కూడా ఒక భాగం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని" తన ఆనందాన్ని పంచుకున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ ను హీరోయిన్ గా ఎంచుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ "బాహుబలి 2" తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.