విజయవాడలోని పైపుల రోడ్డు సెంటర్ లో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని వివాదాస్పద దర్శకుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. అందుకోసం వర్మ ఈరోజు ముంబయి నుంచి విజయవాడకు వచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీసులు వర్మకు నోటీసులు జారీచేశారు. ఒక వైపు గ్రూప్ 1 ప్రిలిమనరీ పరీక్షలు జరుగుతున్నాయనీ, మరోపక్క ఆర్జీవీ మీడియా సమావేశం కారణంగా అత్యవసర సేవలకు ఇబ్బంది తలెత్తే అవకాశం అందని నోటీసుల్లో తెలిపారు.
కాబట్టి మీడియా సమావేశాన్ని ఏదైనా ప్రెస్ క్లబ్ లేదా హాల్ కు మార్చుకోవాలని వారు సూచించారు. ప్రస్తుతం నగరంలో 144 సెక్షన్, పోలీస్ చట్టంలోని సెక్షన్ 30 అమలవుతున్న విషయాన్ని అందులో తెలియజేశారు. పోలీస్ నోటీసుల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ మనసు మార్చుకున్నారు. దీంతో విజయవాడలోని గాంధీనగర్ లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. మరికాసేపట్లో గన్నవరం విమానాశ్రయంకు చేరుకోనున్న వర్మ విలేకరులతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై మాట్లాడనున్నట్టు సమాచారం.