వెలగపూడి, ఆగస్ట్ 26: నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సన్మానం కార్యక్రమం నిర్వహించింది. ఈ నేపధ్యంలో భారీ ర్యాలీ నడుమ వెంకయ్యనాయుడు వెలపూడి సచివాలయానికి తరలివెళ్లారు. ఉపరాష్ట్రపతికి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రజల ఘన స్వాగతం లభించింది. కాగా, ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడిని ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు 30 నిమిషాలు ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ పక్షాన నిలబడిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు అని చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి వెంకయ్య చాలా కృషి చేశారని ఆయన కొనియాడారు. ప్రత్యేక ప్యాకేజి విషయంలో ఆయన కృషి ప్రశంసనీయమని అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందురోజే రాష్ట్రానికి ఇళ్లు మంజూరవడానికి వెంకయ్య సంతకం చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. అవే ఇళ్లకు ఇప్పుడు వెంకయ్య చేతుల మీదుగా శంకుస్థాపన చేయించినట్లుగా ఆయన తెలియజేశారు. రియల్ ఎస్టేట్ కోసం ఓ కమిషన్ వేసి, మూడేళ్లలో దేశం మర్చిపోలేని విధంగా పట్టణాలను అభివృద్ధి చేశారని చంద్రబాబు కొనియాడారు. నేడు రాష్ట్ర ప్రజలు వెంకయ్యనాయుడికి గొప్పగా స్వాగతం పలికారు. విద్యార్థులు, మహిళలు అందరూ మానవహారం ఏర్పాటు చేసి, జెండా పట్టుకుని నవ్వుతూ స్వాగతం చెప్పారు. ఇదంతా ఆయన మీద ఉండే గౌరవం వల్లే సాధ్యమైంది. ఆయన ఏ స్థానంలో ఉన్నా ఆ పదవికి వన్నె తీసుకువస్తారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి, తిరుగులేని శక్తిగా ఎదిగిన వ్యక్తి వెంకయ్య. ఆయన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి` అని సీఎం తెలిపారు. ఉత్తర భారత నేతలకు ధీటుగా హిందీ మాట్లాడే ఏకైక దక్షిణ భారత వ్యక్తి వెంకయ్య నాయుడు, నమ్మిన సిద్ధాంతాలను ఆయన ఉల్లంఘించిన దాఖలాలు లేవని సీఎం అన్నారు. ఉపరాష్ట్రపతి అవడం వల్ల ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పెద్ద దిక్కును కోల్పోయిందన్న బాధ కూడా ఒకింత ఉందని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో కూడా వెంకయ్య ఆశీస్సులు రాష్ట్రంపై ఉంటాయని ఆశిస్తున్నట్లు, భావి తరాలు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, వెంకయ్య నాయుడిని గౌరవించే అవకాశం రావడం ఒక అరుదైన అవకాశం. ఇది మన అదృష్టం, నేను చాలా గర్వపడుతున్నాను. నిరంతరం ప్రజల కోసం ఆలోచించే మహోన్నతమైన వ్యక్తి మన వెంకయ్యనాయుడు అని చంద్రబాబు తెలిపారు.