శ్రీ లక్ష్మీ కేసును కొట్టివేసిన హై కోర్టు

SMTV Desk 2017-06-03 13:44:56  srilaxmi, ias, cleancheet, dalmiya cement

హైదరాబాద్, జూన్ 3 : దాల్మియా సిమెంట్స్ సున్నపురాయి లీజు మంజూరుకు సంబంధించిన కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కి ఊరట లభించింది. ఆ కేసులో ఆమె పై ఐపీసీ 120 బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 409 (విశ్వాస ఘాతుకం) సెక్షన్ల కింద నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. అయితే అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్ ) లోని సెక్షన్ 13 (ప్రభుత్వ ఉద్యోగి దుష్ర్పవర్తన) కింద నమోదుచేసిన కేసు మాత్రం కొట్టివేసేందుకు కోర్టు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్ రావు గురువారం తీర్పునిచ్చారు. కడప జిల్లా మైలవరం మండలం పరిధిలో408 హెక్టార్ల సున్నపురాయి గనులను రాష్ట్ర ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్ కు లీజుకిచ్చింది. ఈ లీజు మంజూరులో అప్పట్లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీ లక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది.ఆమెను 5వ నిందితురాలిగా చేర్చింది.సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కోనసాగుతున్నది. అయితే తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ శివ శంకర్ రావు గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలేమి లేవని స్పష్టం చేశారు. ఐపీసీ సెక్షన్ 13 కింద నమోదు చేసిన కేసును మాత్రం కొట్టివేసేందుకు నిరాకరించారు. ఈ సెక్షన్ కింద నమోదు చేసిన అభియోగాలు మినహా, మిగితా సెక్షన్ల కింద కేసుల్లో ఏవైనా అభియోగాలు నమోదు చేసి ఉంటే అవేవీ చెల్లవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.