న్యూఢిల్లీ, ఆగస్ట్ 25: ప్రజాకర్షక దిశగా అడుగులు వేస్తున్న ప్రధాని మోదీ ఇటీవల కేంద్ర మంత్రివర్యులకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయవద్దు అంటూ హితోపదేశం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మోదీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. ఢిల్లీలో ప్రధానిని 80 మందికి పైగా అదనపు కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు గురువారం కలిసిన నేపధ్యంలో పలు విషయాలు చర్చించారు. ఈ తరుణంలో అధికారులు ఫైళ్లకు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని, సమస్యలు సులభంగా గుర్తించగలమని, తమ పనిని అవకాశంగా మార్చుకుని, ప్రభుత్వ పాలనలో మార్పులు తీసుకురావాలంటూ మోదీ పిలుపునిచ్చారు. వృత్తిని పనిలా చూడకుండా దేశానికి సేవ చేయగల అవకాశంగా భావించాలని ఆయన అన్నారు. దీనికోసం అవసరమైనంత మేర సాంకేతికత సహాయం తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 2001 గుజరాత్ భూకంపం సమయంలో అధికారుల చాకచక్యాన్ని, పనితీరుని ఆయన కొనియాడారు. దీనితో పాటు వాతావరణ పరిస్థితులు, పరిశుభ్రత, వ్యవసాయం, విద్య గురించి కూడా అధికారులు ప్రధానితో సమీక్షలు జరిపినట్లు సమాచారం.