తెలుగు తెరకి ఈ మధ్యకాలంలో పరిచయమైన అందమైన కథానాయికల్లో మెహ్రీన్ ఒకరుగా చెప్పుకోవచ్చు. గ్లామరస్ పాత్రలతో యూత్ హృదయాలను కొల్లగొట్టేసిన ఈ సుందరి, ఇటీవలే ఎఫ్ 2 సినిమాతో తన ఖాతాలో భారీ హిట్ ను జమ చేసుకుంది. ఈ సినిమా తరువాత ఆమె చాలా బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ మెహ్రీన్ మాత్రం తనకి నచ్చిన పాత్రలను మాత్రమే ఓకే చేస్తూ వెళుతోంది.
తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో నటిస్తున్న ఆమె, తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నాగశౌర్య హీరోగా ఆయన సొంత బ్యానర్ లోనే ఒక సినిమా నిర్మితం కానుంది. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. ప్రస్తుతం అవసరాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న నాగశౌర్య, అది పూర్తికాగానే కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు.