తెలంగాణలో రేపు ‘మహర్షి’ సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్లు, మల్టిప్లెక్స్ యాజమాన్యాలు టికెట్ల ధరలను అమాంతం పెంచేయడంపై తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే 79 థియేటర్లు ధరలను పెంచాయని మండిపడ్డారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈరోజు తెలంగాణ సీఎస్ తో తలసాని ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా న్యాయశాఖ, హోంశాఖ కార్యదర్శితోనూ ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఈ వ్యవహారంలో హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లాలని హోంశాఖ కార్యదర్శికి సూచించానని స్పష్టం చేశారు.