నంద్యాల కాల్పులు నాపై హత్యాయత్నమే: అభిరుచి మధు

SMTV Desk 2017-08-24 17:49:26  Nandyala, YSRCP, TDP, Abhiruchi Madhu, Silpa Chakrapani

నంద్యాల, ఆగస్ట్ 24: నేటి ఉదయం నంద్యాలలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనపై టీడీపీ నేత అభిరుచి మధు స్పందిస్తూ... తనపై శిల్పా కుటుంబానికి ఉన్న వ్యక్తిగత శత్రుత్వం వల్లనే, చనిపోయిన వ్యక్తిని కడసారి చూసి వస్తున్న తనపై పక్కా ప్రణాళికతో దాడికి దిగారని ఆయన తెలిపారు. కారులో ఉన్న మమ్మల్ని వ్యూహం ప్రకారం బయటికి రప్పించి ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఇది కేవలం నాపై హత్యాయత్నమే అంటూ ఆయన ఆరోపించారు. సమయానికి తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరపకపోతే... తనను చంపేసేవారని తెలిపారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా శిల్పా మనుషులు వచ్చి నిన్ను కచ్చితంగా చంపేస్తాం అని హెచ్చరించారని ఆయన పేర్కొన్నారు. శిల్పా సోదరులకు అడ్డు వచ్చే ప్రతీ ఒక్కరి పై రౌడీషీట్ ను ఓపెన్ చేయించడం వారి పద్ధతి. చివరకు గుళ్లోని పూజారులపై కూడా రౌడీ షీట్ తెరిపించేంత గొప్పతనం వారికి ఉందంటూ విమర్శించారు. నంద్యాల పట్టణం ప్రశాంతంగా ఉండాలన్నదే తన కోరిక అని, తనను చంపాలనేదే శిల్పా సోదరుల ఆశయం అయితే, వారి ఇంటికి వెళ్లి ప్రాణాలు అర్పించడానికి కూడా తాను వెనుకాడనని ఆయన తెలిపారు.