వైజాగ్: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు ఎలిమినేటర్ మ్యాచ్ వైజాగ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనున్నాయి. ఇందులో గెలిచే జట్టు క్వాలిఫయర్2కు అర్హత సాధిస్తోంది. అయితే తొలి క్వాలిఫయర్లో ఓడిన జట్టుతో ఎలిమినేటర్ విజేత ఢీకొని ఇందులో గెలిచే జట్టు ఫైనల్కు చేరుకుంటోంది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 14 మ్యాచుల్లో 9 విజయాలు సాధించి దర్జాగా ప్లేఆఫ్కు చేరుకుంది. మరోవైపు మాజీ ఛాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో 14 మ్యాచుల్లో ఆరు విజయాలు మాత్రమే సాధించి అనూహ్యంగా ప్లేఆఫ్ బెర్త్ను దక్కించుకుంది. కోల్కతా, పంజాబ్ జట్లు కూడా ఆరేసి విజయాలు సాధించినా రన్రేట్లో వెనుకబడడంతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి. మరోవైపు హైదరాబాద్ మాత్రం మెరుగైన రన్రేట్తో నాకౌట్ రేసులో నిలిచింది. ఢిల్లీతో జరిగే మ్యాచ్ హైదరాబాద్కు సవాలుగా మారింది. హైదరాబాద్తో పోల్చితే ఢిల్లీ చాలా బలంగా ఉంది. డేవిడ్ వార్నర్, బైర్స్టోలు దూరం కావడంతో హైదరాబాద్ బ్యాటింగ్ బలహీనంగా మారింది. దీంతో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే హైదరాబాద్ అసాధారణ ఆటను కనబరచాల్సి ఉంటుంది. మరోవైపు ఢిల్లీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. కానీ, చెన్నైతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యంతో ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో మాత్రం ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలని భావిస్తోంది. ఇటు హైదరాబాద్, అటు ఢిల్లీ విజయమే లక్షంగా పెట్టుకోవడంతో ఎలిమినేటర్ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.