హైదరాబాద్, ఆగస్ట్ 24 : విడుదలకు ముందే ఎన్నో వివాదాలకు దారి తీస్తున్న "అర్జున్ రెడ్డి" చిత్ర పోస్టర్ ను ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత తొలగించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన గురించి హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. "తాతయ్య చిల్" అంటూ పోస్ట్ చేయగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాగా ఆర్జీవీ వ్యాఖ్యలపై హనుమంతరావు మండిపడ్డారు. ముంబైలో ఉండి మాట్లాడడం సరికాదని, అసలు ఈ సారి హైదరాబాద్ లో ఎలా అడుగు పెడతావో చూస్తానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి వర్మ స్పందిస్తూ... "సర్ నన్ను హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వరా? ప్రస్తుతం నేను హైదరాబాద్ లోనే ఉన్నా" అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా "సారూ... నేను రేపు పొద్దున ఉదయం 10.30 గంటలకు ప్రసాద్ ఐమ్యాక్స్ లో మార్నింగ్ షోకి వస్తున్నా... అక్కడ చూసుకుందాం.. బస్తీ మే సవాల్". మీకు దమ్ముంటే మీ మనవళ్లు, మనవరాళ్ల వయసు ఉండే అబ్బాయిలను, అమ్మాయిలను సినిమా థియేటర్లోకి అడుగు పెట్టకుండా చేయాలని మరో సవాల్ విసిరాడు.