న్యూఢిల్లీ, ఆగస్ట్ 24 : ఆధార్ కార్డును అనుసంధానం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. "వ్యక్తిగత గోప్యత కూడా ఒక ప్రాథమిక హక్కు" అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొన్ని ప్రభుత్వ, సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేసిన నేపథ్యంలో దీనిపై విచారించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా.. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని కీలక తీర్పు ఇచ్చింది. బ్యాంకు, పాన్ కార్డు వంటి వాటికి అనుసంధానం చేయడం వల్ల వ్యక్తిగత గోప్యత ఉండదని, అతని సమాచారాన్ని ఎవరైనా తెలుసుకునే వీలుందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో పలు బ్యాంకు అకౌంట్ లకు, పాన్ కార్డుకు ఆధార్ ను అనుసంధానించాలనుకున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి తీవ్ర ఆటంకం ఎదురైంది. ఒక ప్రాథమిక హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదంటూ సుప్రీంకోర్ట్ వెల్లడించింది. అయితే దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది.