ఎక్కువ మార్కులతో పెంచుకున్న కోపం..! చేసిన పాపం..!

SMTV Desk 2017-08-24 10:42:54  Madhya pradesh, sathna village, school Student, mosquito poision

మధ్యప్రదేశ్, ఆగస్ట్ 24 : మనతో పాటు చదివే తోటి విద్యార్థులకు మనకంటే ఎక్కువ మార్కులు వస్తే కోపం రావడం సహజం. కాని ఇక్కడ ఓ బాలిక తన కన్నా ఎక్కువ మార్కులు సాధి౦చిందన్న కోపంతో తన తోటి విద్యార్థినిపై విష ప్రయోగం చేసింది. ఆపై పోలీసులకు భయపడిపోయి తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఘటన వివరాలలోకి వెళితే... మధ్యప్రదేశ్ సత్నా పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక తన తోటి విద్యార్థిని తనకన్నా ఎక్కువ మార్కులు సాధి౦చిందని తనపై కోపం పెంచుకుంది. ఆ కోపంతో ఆమె తాగే నీళ్ళ బాటిల్ లో దోమలను నాశనం చేసే మందును కలిపింది. ఈ విషయం తెలియని మరో బాలిక ఈ నీళ్ళను తాగి వాంతులు చేసుకోవడంతో యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించగా వెంటనే వారు తనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రతి దృశ్యం ఆ తరగతి గదిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదైయింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా భయపడ్డ సదరు బాలిక ఇంట్లో అదే తరహాలో ద్రావణాన్ని తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రిలో చేర్చగా తన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.