భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్పై వచ్చిన లైంగిక ఆరోపణలను సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ తోసిపుచ్చింది. మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల్లో నిజం లేదని జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. సీజేఐని ఇరికించేందుకే ఈ విధమైన ఆరోపణలు చేశారని తెలిపింది.
అదేవిధంగా ఈ అంశంపై గత కొన్నిరోజులుగా విచారణ జరిపిన కమిటీ మహిళా ఉద్యోగినిని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఆమె ఇచ్చిన సమాధానాలను.. వార్తా పత్రికలకు ఇస్తున్న పలు ఇంటర్వ్యూలను పరిశీలించిన తర్వాత ఆమె చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కమిటీ వివరించింది.
కాగా జస్టిస్ గొగొయ్ వద్ద పనిచేసిన మాజీ జూనియర్ అసిస్టెంట్ ఒకరు తనపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత దీనిపై విచారణకు జస్టిస్ గొగొయ్ నేతృత్వంలోనే ఓ ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేశారు. దీనిపై పలు అభ్యంతరాలు రావడంతో అంతర్గత దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపారు.