బాలీవుడ్ దిగ్గజ హీరో అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. 76 ఏళ్ల అమితాబ్ బచ్చన్ ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్టు సమాచారం .. ఈ క్రమంలో ప్రతి ఆదివారం తన అభిమానులతో కలిసే ఆయన ఈసారి కలవలేకపోతున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గత 36 ఏళ్లుగా ప్రతి ఆదివారం తన ఫ్యాన్స్ను తన ఇంటి వద్దే కలుస్తుంటారు. ముంబైలోని తన ఇంటి (పేరు జల్సా) వద్ద అభిమానులను పలకరించి వారిలో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. అమితాబ్ బచ్చన్ను కలవాలనుకునే చాలా మంది ఫ్యాన్స్ ఇలా ఆదివారం తమ అభిమాన నటుడి ఇంటి వద్ద క్యూ కడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో అభిమానులను కలవడానికి కుదరడం లేదని తన బ్లాగ్లో వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ‘అభిమానులకు, ఇతరులకు, ఈ ఆదివారం దర్శన్ కుదరడం లేదు. నొప్పి వల్ల బెడ్ మీదే ఉన్నా. భయపడాల్సిందేం లేదు. బయటకు రాలేకపోతున్నాను అంతే.’ అని తన బ్లాగ్లో వెల్లడించారు.