చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున ఆడుతున్న టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్, ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డాడు. అయితే మే 30న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కు టీంఇండియా తరుపున ఎన్నికైన జాదవ్ కు గాయమవడం కలవరపరుస్తోంది. మ్యాచ్ అనంతరం దీనిపై చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడారు. కేదార్కి ప్రస్తుతం ఎక్స్-రే నిర్వహించామని, సోమవారం అతనికి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. జాదవ్ కోలుకుంటాడని కోరుకుంటున్న అని అన్నారు. మిగిలిన ఐపిఎల్ మ్యాచుల్లో అతన్ని ఇక ఆడించబోమన్నారు. గాయం తీవ్రం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ కోసం అతను ఫిట్గా ఉండటం ముఖ్యమని చెప్పుకొచ్చారు. అయితే, జాదవ్ కు అయిన గాయం అంత పెద్ద గాయంలా కనిపించడం లేదన్న ఆయన మంచి జరగాలనే జట్టు సభ్యులతో పాటు యాజమాన్యం కోరుకుంటుందని తెలిపారు. ఆల్ రౌండర్ గా రాణిస్తున్న జాదవ్ టీమిండియాకు దూరమైతే కొంత కష్టాల్లోపడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ కేదార్ గాయం తీవ్రమైనదిగా తెలితే మాత్రం స్టాండ్-బేలో ఉన్న అంబటి రాయుడు లేదా రిషబ్ పంత్లలో ఒకరికి జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.