హైదరాబాద్: ఆదివారం రాత్రి జరిగిన ముంభై లోని వంఖేడ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్రైడర్స్ని 9 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ జట్టు చిత్తుగా ఓడించడంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్ బెర్తుని సొంతం చేసుకుంది. ఈ సీజన్లో హైదరాబాద్ 14 మ్యాచ్లాడి ఆరింట్లో మాత్రమే గెలుపొంది12 పాయింట్లతో ప్లేఆఫ్కి చేరిన తొలి జట్టుగా ఐపీఎల్లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. సన్రైజర్స్తో పాటు ప్లేఆఫ్ చేరిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 14 మ్యాచ్ల్లో ఏకంగా 9 మ్యాచ్ల్లో గెలుపొంది 18 పాయింట్లతో ప్లేఆఫ్కి చేరడం విశేషం. ప్రాథమికంగా 16 పాయింట్లు సాధిస్తే..? ప్లేఆఫ్ చేరేందుకు జట్లకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. గత సీజన్లలో 14 పాయింట్లతోనే ప్లేఆఫ్కి చేరిన జట్లూ లేకపోలేదు. కానీ. కేవలం 12 పాయింట్లతోనే ప్లేఆఫ్ బెర్తు దక్కడం 12 ఏళ్ల ఐపీఎల్లోనే ఇదే తొలిసారి. వాస్తవానికి టోర్నీలో కోల్కతా నైట్రైడర్స్ (+0.028), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (-0.251) జట్లు కూడా 12 పాయింట్లు సాధించాయి. కానీ.. వాటితో పోలిస్తే సన్రైజర్స్ హైదరాబాద్(+0.577)కి నెట్ రన్రేట్ అధికంగా ఉండటంతో ప్లేఆఫ్ ఛాన్స్ దక్కింది. ప్లేఆఫ్కి చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబయితో ఆదివారం ఢీకొన్న కోల్కతా జట్టు 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడటం హైదరాబాద్కి కలిసొచ్చింది. 2016 ఐపీఎల్ విజేతగా నిలిచిన హైదరాబాద్.. 2018 సీజన్ ఫైనల్లో చెన్నై చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.