న్యూఢిల్లీ, ఆగస్ట్ 23 : ఓపెన్ స్కూల్స్ లో జరిగే పరీక్షలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకరికి బదులు మరొకరు పరీక్షలకు హాజరవుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్(ఎన్ఐఓఎస్) సూచించింది. గత మార్చిలో జరిగిన ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయడాన్ని పర్యవేక్షకులు గుర్తించారు. ఇక అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్ఐఓఎస్ అధికారి వెల్లడించారు. దీనికోసం పరీక్ష కేంద్రాల్లో వేలిముద్ర మెషీన్లను ఏర్పాటు చేసారు. అభ్యర్థి వేలిముద్రలు, తమ ఆధార్ వేలిముద్రల డేటాబేస్ తో సరిపోతేనే తనను లోపలి అనుమతిస్తామని, అంతేకాకుండా ఇక నుంచి పరీక్ష కేంద్రాలుగా సీసీ కెమెరా సౌకర్యాలు ఉన్న పాఠశాలలను మాత్రమే ఎంచుకోనున్నట్లు అధికారులు తెలిపారు.