బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ఉత్తరప్రదేశ్ లోని లక్నో లోక్ సభ స్థానానికి సమాజ్ వాదీ పార్టీ తరుపున పోటీచేస్తున్న తన తల్లి పూనమ్ సిన్హా తరుపున ప్రచారంలో మునిగిపోయింది. తల్లి విజయం కోసం నిన్న లక్నోలో సోనాక్షి సిన్హా రోడ్ షో నిర్వహించారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి, కన్నౌజ్ ఎంపీ అభ్యర్థి డింపుల్ యాదవ్తో కలిసి సోనాక్షి ప్రచారంలో పాల్గొని కార్యకర్తలకు హుషారు నింపారు. ప్రజాసేవ కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన తల్లిని గెలిపించాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు
అదేవిధంగా పూనమ్తో పాటు సోనాక్షి, డింపుల్ రావడంతో వారిని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక లక్నో లోక్సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పూనమ్, బీజేపీ నుంచి కేంద్రమంత్రి, సిటింగ్ ఎంపీ రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ నుంచి గురు ఆచార్య ప్రమోద్ కిృష్ణణ్ బరిలో ఉన్నారు.
కాగా మాజీ ప్రధాని అటల్బిహారి వాజ్పేయీ ప్రాతినిథ్యం వహించిన లక్నోలో 1991 నుంచి ఇప్పటి వరకు బీజేపీ మినహా మరేపార్టీ విజయం సాధించకపోవడం విశేషం. 1991 నుంచి 2009 వరకు వాజ్పేయీ ఇక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో రాజ్నాథ్ సింగ్ గెలుపొందారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిగా పోటీ చేస్తుండడంతో ఈ స్థానం ఎన్నిక విషయంలో పార్టీలో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.