భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత నేపథ్యంలో ఒమంగ్ కుమార్ పీఎం నరేంద్ర మోదీ అనే టైటిల్తో చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావలసి ఉన్నా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు ఈ చిత్రాన్ని నిషేదించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు మోదీ బయోపిక్ను రిలీజ్ చేయోద్దని ఇటీవల ఈసీ నిర్ణయం తీసుకోగా ఇప్పుడు ఎట్టకేలకు మార్గం సుగుమమైంది. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 23న వెలువడనున్నాయి. ఈ తర్వాతనే ఈ చిత్రం విడుదల చేయాలని ఈసీ చిత్ర బృందానికి చెప్పడంతో 24న విడుదల చేయడానికి నిర్ణయించారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన సందీప్ సింగ్ ట్విటర్ ద్వారా మే 24న చిత్రాన్ని విడుదల చేయనున్నామని అధికారికంగా ప్రకటించారు.
పీఎం నరేంద్రమోదీ బయోపిక్లో మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ నటిస్తుండగా, ముఖ్య పాత్రలలో పలువురు సీనియర్ నటులు నటిస్తున్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా పాత్రని మనోజ్ జోషి చేస్తున్నాడు. మోదీ తల్లి హీరాబెన్ పాత్రలో ప్రముఖ సీనియర్ నటి జరీనా వాహబ్ కనిపించనుంది. ఇక భార్య జశోదాబెన్ పాత్రని బర్ఖా బిస్త్ సేన్గుప్తా చేస్తుంది. వివేక్ తండ్రి సురేశ్ ఒబెరాయ్, సందీప్ సింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 23 భాషలలో విడుదల కానున్నట్టు టాక్.